కలం, వెబ్ డెస్క్: ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) భారత పర్యటనకు రాబోతున్నారు. సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో ఢిల్లీ వేదికగా జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఆయన వస్తున్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. యుద్ధ మేఘాలు ఇంకా అలాగే ఉన్న క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు విదేశీ పర్యటనకు వెళ్తుండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ అత్యున్నత నేత ఒకరు ఇండియాకు వస్తుండటం కూడా ఇదే మొదటిసారి. ఈసారి బ్రిక్స్ సదస్సు భారత్ అధ్యక్షతన జరగబోతుంది. ఈ కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ, ఇండోనేషియా ప్రధాన సభ్య దేశాలుగా ఉన్నాయి.
ఇరు దేశాల సంబంధాలపై చర్చ..
ఇరాన్, అమెరికా యుద్ధంలో భారత్ తటస్థ పాత్ర పోషిస్తూ వస్తోంది. ఏ దేశాన్ని సమర్థించకుండా, యుద్ధం వలన కలుగుతున్న నష్టాన్ని మాత్రమే వ్యతిరేకిస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా హోర్ముజ్ జలసంధిని టెహ్రాన్ మూసివేయడంతో భారత్లో చమురు ధరలు భగ్గుమని.. దేశ ఆర్థిక వ్యవస్థనే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. మరోవైపు ఇరాన్తో సంబంధాలు గతంతో పోలిస్తే కొంత బలహీనంగా మారాయనేది నిపుణుల విశ్లేషణ. ఇరాన్ సుప్రీం నేత ఖమైనీని అమెరికా హత్య చేసినా.. భారత్ స్పందించకపోవడం తమను నిరాశకు గురి చేసిందని అప్పట్లోనే ఇరాన్ దౌత్యవేత్తలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలపై పెజెష్కియాన్ (Masoud Pezeshkian) పర్యటనలో ఎలాంటి పురోగతి ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : గ్రేటర్లో ‘సర్’ ఎఫెక్ట్.. గులాబీ పార్టీకి గుబులు!
Follow Us On : WhatsApp

