కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి జారీ చేయబోతున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards)పై ప్రధాని మోదీ ఫొటో లేకపోవడాన్ని బీజేపీ ఎంపీలు తప్పుబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు మాత్రమే పెట్టుకోవడమేంటన్నారు. ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం 5 కిలోల రేషన్ బియ్యం అందిస్తోందని, కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉందన్న విషయాన్ని రేవంత్ రెడ్డి ఎలా మర్చిపోతున్నారని ప్రశ్నించారు.
మళ్లీ కొత్త కార్డులు ఇవ్వాలి: ఎంపీ ఈటల
కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఇంకో రెండేళ్లు మాత్రమేనని ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. తరువాత వచ్చే కొత్త ప్రభుత్వమే కొత్త కార్డులు అందిస్తుందన్నారు. ఉచితంగా రేషన్ బియ్యాన్ని దేశంలోని ప్రతి పేద వాడికి కేంద్రమే అందిస్తోందన్నారు. అలాంటప్పుడు ప్రధాని మోదీ ఫొటో పెట్టకపోవడం ప్రోటోకాల్ ఉల్లంఘనే అన్నారు.
రాష్ట్రం భగ్గుమంటుంది: ఎంపీ ధర్మపురి అర్వింద్
రేషన్ కార్డులపై (Smart Ration Cards) ప్రధాని మోదీ ఫొటో పెట్టకుంటే రాష్ట్రం భగ్గుమంటుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) హెచ్చరించారు. సీఎం రేవంత్ మరోసారి అధికారంలోకి రాబోరని, అలాంటి వ్యక్తి ఫొటోను కార్డులపై పెట్టడం ఎందుకన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ మనిషని తాను చెబుతూనే ఉన్నానని, అలాంటి వ్యక్తి ఫొటో పెట్టడం సరికాదన్నారు. ఎవరి సొమ్మని రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఫొటో పెట్టుకున్నారని మండిపడ్డారు.
తప్పు సరిదిద్దుకోవాల్సిందే: ఎంపీ రఘునందన్ రావు
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కావాలి కానీ, ప్రధాని మోదీ ఫొటో పెట్టరా.. అని ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) విమర్శించారు. రేపు సంగారెడ్డిలో జరిగే కార్యక్రమంలో ఇప్పటికే ప్రింట్ అయిన కార్డులు ఇచ్చినా.. కొత్త కార్డుల్లో మాత్రం ప్రధాని మోదీ ఫొటో పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. లేకపోతే ప్రజా ఉద్యమం తప్పదన్నారు.
Also Read : ముఖ్యమంత్రి కల్వకుంట్ల అంటూ దానం స్పీచ్.. దేనికి సంకేతం?
Follow Us On: Sharechat

