కలం, వెబ్డెస్క్: తెలంగాణ సర్కార్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. బీసీ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకాన్ని (Sewing Machine Scheme) నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రారంభించారు. హైదరాబాద్లోని సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వీహెచ్, నవీన్ యాదవ్, ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. త్వరలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కుట్టు మిషన్ల కోసం ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.
బీసీ మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చి ఆర్థిక వృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చిందని పొన్నం అన్నారు. రూ.12 వేలు విలువైన కుట్టు మిషన్ను వంద శాతం సబ్సిడీతో మహిళలకు అందజేస్తామని చెప్పారు. లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం వీటిని పూర్తిగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ పథకంలో నిరుపేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, అనాథలు, వికలాంగులు, అలాగే కుట్టు వృత్తిలో అనుభవం ఉన్న మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జరుగుతుందని స్పష్టం చేశారు. దశల వారీగా కుట్టుమిషన్లు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులందరికీ అందేలా చూస్తామని మంత్రి (Ponnam Prabhakar) హామీ ఇచ్చారు.
Also Read : తెలంగాణ ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్
Follow Us On: Instagram

