కలం, సినిమా : ప్రముఖ నటి షకీలా (Actress Shakeela) స్మార్ట్ఫోన్ వినియోగంపై ప్రజలకు కీలక హెచ్చరిక చేశారు. ఇటీవల ఆమె తీవ్రమైన నరాల సమస్యతో బాధపడుతూ మెడకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. అధికంగా స్మార్ట్ఫోన్ ఉపయోగించడం వల్లే తన ఆరోగ్యం దెబ్బతిన్నట్లు ఆమె వెల్లడించారు. తాను గంటల తరబడి మంచంపై ఒకే వైపు తిరిగి పడుకుని మొబైల్లో గేమ్స్ ఆడటం, రీల్స్ చూడటం చేసేదానినని షకీలా తెలిపారు.
ఇలా ఎక్కువసేపు మొబైల్ వినియోగించడం వల్ల మెడ నరాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. ఈ సమస్యకు చికిత్స కోసం సుమారు రూ.3 లక్షలు ఖర్చు చేయడంతో పాటు తీవ్రమైన శారీరక నొప్పిని కూడా అనుభవించినట్లు ఆమె వెల్లడించారు. ఈ అనుభవం తనకు స్మార్ట్ఫోన్ వినియోగంపై ఎన్నో విషయాలు నేర్పిందని తెలిపారు. ప్రజలు మొబైల్ ఫోన్లను అవసరానికి మించి ఉపయోగించకుండా పరిమితి పాటించాలని షకీలా సూచించారు. ముఖ్యంగా పిల్లలను అధిక స్క్రీన్ టైమ్కు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఎక్కువసేపు మొబైల్ చూడటం, ముఖ్యంగా ఒకే వైపు ఒరిగి ఫోన్ ఉపయోగించడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆమె హెచ్చరించారు.

