కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా గంజాయి సరఫరాపై ఈగల్ టీమ్ (Telangana Eagle Team) పంజా విసురుతోంది. నిఘా సమాచారంతో హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో చేపట్టిన ఆపరేషన్ ద్వారా గంజాయి సరఫరా చేస్తున్న 69 మందిని అరెస్ట్ చేసింది. వినియోగిస్తున్న 49 మందిని అదుపులోకి తీసుకుంది. ఎక్కువ మంది హైదరాబాద్ పరిధిలోనే పట్టుబడటం గమనార్హం. ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని మరీ వివిధ మార్గాల ద్వారా రాష్ట్రంలోకి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు.
తనిఖీలు చేస్తున్నా..
తెలంగాణలో డ్రగ్స్ సరఫరాపై ఉక్కు పాదం మోపుతున్నా.. రోజురోజుకు కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పలువురికి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. గంజాయి సరఫరా విషయంలో ఇక నుంచి ఇతర రాష్ట్రాల వ్యవస్థలతో మరింత సమన్వయం చేసుకోవాలని తెలంగాణ ఈగల్ టీమ్ భావిస్తోంది. ఇక్కడకు సరఫరా అవుతున్న గంజాయి ఎక్కువగా పొరుగు నుంచే వస్తుండటంతో.. అక్కడి నుంచి డ్రగ్స్ కట్టడికి చర్యలు మరింత వేగవంతం చేయనుంది.

