కలం, వెబ్డెస్క్: తెలుగు దేశం పార్టీపై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి (MLC Varudu Kalyani) తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ (TDP) ఒక దుశ్శాసనుల పార్టీ అని, ఈ పార్టీ నేతలు ఏపీతో పాటు విదేశాల్లో మహిళలను కూడా వేధిస్తున్నారని ఆరోపించారు. ఒక ఎన్నారై మహిళ తనను టీడీపీ మంత్రి వేధించారని సోషల్ మీడియా వేదికగా మంత్రి లోకేశ్కు తన గోడు చెప్పుకుందని వెల్లడించారు. కానీ, లోకేశ్ ఆ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. చంద్రబాబుది మంత్రివర్గమా? లేక మహిళలను వేధించే వర్గమా? అని కళ్యాణి ప్రశ్నించారు. టీడీపీ అంటే తెలుగు దేశం పార్టీ కాదని, తెలుగు దుశ్శాసనుల పార్టీ అని విమర్శించారు.
ఒక తెలుగు ఎన్నారై మహిళ డల్లాస్లో ఉంటూ ఓ స్వచ్ఛంద సంస్థ నడిపిస్తున్నారని తెలిపారు. టీడీపీ మంత్రులు డల్లాస్లో జరిగిన నాటా సమావేశాలకు వెళ్లినప్పుడు సదరు మహిళ ఓ మంత్రిని అపాయింట్మెంట్ కోరిందని చెప్పారు. తన స్వచ్ఛంద సంస్థ గురించి, తాము నిర్వహించే కార్యక్రమాల గురించి వివరించడానికి అపాయింట్మెంట్ అడిగితే సదరు మంత్రి ఒంటరిగా వచ్చి కాఫీ షాప్లో కలవాలని కోరినట్లు తెలిపారు. తాను టీంతో వస్తానని చెప్తే మంత్రి నిరాకరించారని, ఇంకా ఆ మహిళకు తన కాళ్లు, చేతులు ఉన్న ఫోటోలు పంపించాడని పేర్కొన్నారు.
ఎన్నారై మహిళ తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, సదరు మంత్రిపై చర్యలు తీసుకోవాలని అడుగుతున్నా లోకేశ్ ఎందుకు పట్టించుకోవడం లేదని కళ్యాణి ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు ఎలాగూ రక్షణ లేదని, విదేశాల్లో ఉండే మహిళకు కూడా ఇవే పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మంత్రిపై చర్యలు తీసుకొని, బాధిత మహిళకు న్యాయం చేయాలని మంత్రి లోకేశ్ను డిమాండ్ చేశారు.

