కలం, మెదక్ బ్యూరో: ప్రేమించి మోసం చేశాడని, పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు (Woman Protest) దిగిన సంఘటన సంగారెడ్డి (Sangareddy) జిల్లా పటాన్చెరు (Patancheru) లో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. పటాన్చెరు పరిధిలోని నాయికోటి బస్తీకి చెందిన శ్రవణ్ అనే యువకుడికి, అరుణ అనే యువతికి లింగంపల్లిలోని ఓ క్లినిక్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
ప్రేమ పేరుతో శ్రవణ్ తనను నమ్మించి, శారీరకంగా దగ్గరయ్యాడని యువతి తెలిపింది. దీనివల్ల తాను ప్రస్తుతం 7 నెలల గర్భిణిగా ఉన్నట్లు వెల్లడించింది. అయితే, ఇప్పుడు పెళ్లి ప్రస్తావన తేగా శ్రవణ్ ముఖం చాటేస్తూ, పెళ్లికి నిరాకరిస్తున్నాడని అరుణ ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం పటాన్చెరు నాయికోటి బస్తీలోని శ్రవణ్ ఇంటి ఎదుట ఆమె ధర్నాకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని, శ్రవణ్తోనే తనకు పెళ్లి జరిపించాలని బాధితురాలు వేడుకుంటోంది.

