కలం, నిర్మల్: రైతులు సాగునీటిని సద్వినియోగం చేసుకుని లాభదాయకమైన పంటలు సాగు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) అన్నారు. మంగళవారం సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టు (Swarna Project) నుంచి జౌళి కాలువ ద్వారా 80 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ ద్వారా 20 క్యూసెక్కుల సాగునీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవసాయానికి సాగునీరు అత్యంత కీలకమని, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు కెనాళ్ల ద్వారా నీటిని విడుదల చేసినట్లు తెలిపారు.
రైతులు అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. అనంతరం స్వర్ణ ప్రాజెక్టు గేట్ల వద్ద లీకేజీలను పరిశీలించిన ఎమ్మెల్యే, అవసరమైన మరమ్మతు పనులను అత్యవసరంగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, బీజేపీ నాయకులు, పాల్గొన్నారు.

