జూరాలతో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు: కలెక్టర్

కలం, జోగులాంబ గద్వాల: జూరాల ప్రాజెక్టు పరిధిలో చేపట్టిన జిల్లాలోని వివిధ ఎత్తిపోతల పథకాలతో ప్రస్తుతం వస్తున్న వరద నీటితో అన్ని రిజర్వాయర్లను నింపుకోవడంతో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీటిని అందించవచ్చని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ (Gadwal Collector Rizwan Basha Shaik) అన్నారు. మంగళవారం ధరూర్ మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ మ్యాపును, వివిధ రిజిస్టర్ లను పరిశీలించారు.

ప్రాజెక్ట్ గేట్ల పరిశీలన..

కర్ణాటక ప్రాజెక్టుల నుంచి కొద్దిరోజులుగా కృష్ణా నదికి పెద్ద ఎత్తున వరద వస్తుండడంతో జూరాల ప్రాజెక్ట్ (Jurala Project) పూర్తిస్థాయి నీటి సామర్థ్యం, గేట్ల ద్వారా దిగువకు వదులుతున్న ఎత్తిపోతల పథకాలకు, సమాంతర కాలువలకు వినియోగిస్తున్న వరద నీరు తదితర వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ గేట్లను పరిశీలించిన కలెక్టర్ అక్కడి యంత్రాల పనితీరు, సిబ్బంది వివరాలను అడిగారు. పవర్ హౌస్ నుంచి ఉత్పత్తి అయ్యే జలవిద్యుత్ గురించి అధికారులు కలెక్టర్ కు వివరించారు.

నీటిని మళ్లించాలి..

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జూరాల కుడి కాలువ లైనింగ్ మరమ్మత్తులు, ఇతర పనులను వేసవిలోనే పూర్తి చేయాలని చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందాలంటే కాలువల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టుల నిర్వహణకు వచ్చే నిధులను ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదన్నారు. జూరాల కుడికాలువ ద్వారా ఆర్డిఎస్ పరిధిలోని లింక్ కెనాల్ లకు నీటిని మళ్లించేందుకు ప్రయత్నించాలని, ఫలితంగా అలంపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.

ఆరుతడి పంటలు సాగు చేయాలి..

ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్నందున రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నప్పటికీ కాలువల పరిధిలోని రైతులు ప్రస్తుతం నీటిని విడుదల చేస్తుండడంతో వరి సాగు చేసే అవకాశం ఉందన్నారు. వరి పండించే రైతుల పంటలు చేతికొచ్చే వరకు కాలువల ద్వారా వరి సాగుకు నీటి లభ్యత గురించి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

రిజర్వాయర్లను నింపుకోవాలి..

గద్వాల నియోజకవర్గ పరిధిలోని గూడెం దొడ్డి, ర్యాలంపాడు, తదితర రిజర్వాయర్లను ప్రస్తుతం వస్తున్న వరద నీటితో పూర్తి స్థాయిలో నింపుకోవాలని సూచించారు. వేసవిలో తాగునీటి సమస్యలు ఉత్పన్నం అవ్వకుండా ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. జూరాల గేట్లు తెరవడంతో సెలవు రోజుల్లో పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నందున వంతెనపై ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. సందర్శకులు ఘాట్ల వద్ద నీళ్లలోకి దిగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

భూసేకరణ వేగవంతం చేయాలి..

ఇరిగేషన్ రహదారుల అభివృద్ధికి ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో మరమ్మత్తులు చేయించేందుకు ఇటీవల జిల్లాలో పర్యటించిన రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించినందున సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ వేగవంతం చేయాలని, ఆర్అండ్ఆర్ కేంద్రాల్లో నివసిస్తున్న ప్రజలకు పూర్తిస్థాయిలో సదుపాయాలను కల్పించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో నీటిపారుదల శాఖ ఎస్ఈ కేశవరావు, డిఈ నాగేశ్వరరావు, తహసిల్దార్ నందిని, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>