కలం, దేవరకొండ : రాష్ట్రంలోని రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తోందని దేవరకొండ (Devarakonda) ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ (MLA Balu Naik) తెలిపారు. నల్లగొండ (Nalgonda) జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా చింతపల్లి మండలం గడియ గౌరారం ఎక్స్ రోడ్ వద్ద రైతు అల్వాల యాదయ్య పొలంలో ఎమ్మెల్యే బాలు నాయక్ అధికారులతో కలిసి ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే (MLA Balu Naik) మాట్లాడుతూ.. వంటనూనెల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు రైతులకు స్థిరమైన, అధిక ఆదాయాన్ని అందించడంలో ఆయిల్ ఫామ్ సాగు కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. నీటి వసతులు ఉన్న రైతులు సంప్రదాయ పంటలతో పాటు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఆయిల్ ఫామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగు ద్వారా దీర్ఘకాలంలో నిరంతర ఆదాయం లభించి రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతారని పేర్కొన్నారు. సాగుకు అవసరమైన నాణ్యమైన మొక్కల పంపిణీతో పాటు సాంకేతిక సలహాలు, అవసరమైన మార్గదర్శకాలను ఉద్యానవన శాఖ ద్వారా ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, పంటలకు గిట్టుబాటు ధరలు, సాగునీరు, వ్యవసాయ మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే వివరించారు. దేవరకొండ నియోజకవర్గంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా అధికార ప్రతినిధి ముచ్చర్ల గిరి, చింతపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జటావత్ హరినాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల వెంకటయ్య గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు అంగిరేకుల నాగభూషణం, ఉద్యానవన శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Also Read : ‘నా గెలుపు బీజేపీకి ఒక సందేశం’.. పీకే కీలక వ్యాఖ్యలు
Follow Us On: Instagram

