కలం, వెబ్ డెస్క్: అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు హైదరాబాద్ (Hyderabad) సిద్ధమవుతోంది. రేపటి నుంచి రెండు రోజుల పాటు బ్రిక్స్ దేశాల అవినీతి నిరోధక కార్యాచరణ బృందం సదస్సు జరగనుంది. కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుండగా.. సెక్రటరీ రచనా షా సదస్సును ప్రారంభించబోతున్నారు. బ్రిక్స్ కూటమి దేశాల్లో అవినీతి నిరోధానికి ఎలాంటి చర్యలు చేపట్టవచ్చే అనే అంశంపై జరగనుంది. సభ్య దేశాలతో పాటు అవినీతి నిరోధక నిపుణులు కూడా పాల్గొనబోతున్నారు. జూన్ నెలలో జరిగిన సమావేశానికి హైదరాబాద్ సదస్సు పొడగింపు అని డీవోపీటీ వర్గాలు వెల్లడించాయి. 2026 సంవత్సరానికి బ్రిక్స్ కూటమికి అధ్యక్ష హోదాలో భారత్ నిర్వహించబోతున్న చివరి సదస్సు ఇదే కావడం గమనార్హం.
ఏమేం అంశాలు చర్చించబోతున్నారంటే..
బ్రిక్స్ కూటమి దేశాల్లో అవినీతి కేసుల్లో భాగంగా తప్పించుకుంటున్న నేరస్థులను గుర్తించి, వారిపై తదుపరి చర్యలు తీసుకునే విషయమై చర్చ జరగబోతుంది. పరస్పర సహకారం అందించుకోవడంతో పాటు అవసరమైన సాంకేతిక విభాగాల మధ్య సమన్వయం ఎలా పెంచుకోవాలనేది సమీక్షించబోతున్నారు. అదే సమయంలో, ప్రస్తుత డిజిటల్ యుగంలో డిజిటల్ ఆస్తుల రక్షణ, వాటి కారణంగా పెరుగుతున్న అవినీతిని ఎలా నిరోధించాలనేది కూడా నిపుణులు తమ అనుభవాలను వివరించబోతున్నారు. బ్రిక్స్ దేశాల్లోని పరిపాలనా వ్యవస్థల్లో అనుభవాలను కూడా పంచుకోబోతున్నారని డీవోపీటీ వెల్లడించింది.

