కలం, వెబ్ డెస్క్: పార్లమెంట్ సమావేశాలు 11వ రోజు జరుగనున్న నేపథ్యంలో ఢిల్లీలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశం (Parliament Session) జరగనుంది. పార్లమెంట్లోని రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో సభ్యులు సమావేశం కానున్నారు. పార్లమెంట్లో అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు.. ప్రజాసమస్యలను, కీలక అంశాలను ప్రస్తావించడంపై చర్చించనున్నారు. ఉభయసభల్లో అధికార పక్షాన్ని నిలదీసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
సోమవారం ఢిల్లీలో 11వ రోజు పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. నేడు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. సుప్రీం న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచేందుకుగాను ఈ బిల్లు రూపొందించారు. 1956 చట్టానికి సవరణ చేస్తూ ఏర్పాటు చేసిన బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. సుప్రీంకోర్టులో పెండింగ్ కేసుల భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకొచ్చారు.

