కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని జాతీయ రహదారి–65పై గల నిజాంపూర్ ఎక్స్ రోడ్, ఆరూర్ గ్రామ జంక్షన్ల వద్ద వెంటనే ఫ్లైఓవర్లు నిర్మించాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు.
ఈ సందర్భంగా ముంబై హైవే పై ఇబ్బందులను నితిన్ గడ్కరీకి తెలిపారు. నిజాంపూర్ ఎక్స్ రోడ్ అనేది ముబారక్పూర్, వెల్టూర్, నిజాంపూర్, కొల్కూర్, పొట్టిపల్లి, మాచిరెడ్డిపల్లి గ్రామాలను అనుసంధానించే కీలక కూడలి అని, అలాగే ఆరూరు జంక్షన్ కూడా పరిసర గ్రామాలను జాతీయ రహదారితో కలిపే ప్రధాన మార్గమని వివరించారు.
ఈ కూడళ్ల మీదుగా నిత్యం భారీ సరుకు రవాణా వాహనాలు, స్కూల్ బస్సులు, వ్యవసాయ వాహనాలు పెద్ద ఎత్తున రాకపోకలు సాగిస్తుంటాయని, ఫ్లైఓవర్లు లేకపోవడం వల్ల తరచూ జరుగుతున్న ఘోర ప్రమాదాల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతున్న దృష్ట్యా, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు జాతీయ రహదారి అభివృద్ధి కార్యక్రమం కింద ఫ్లైఓవర్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, తక్షణమే పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.

