కలం, కరీంనగర్ బ్యూరో: నీట్ పరీక్ష పేరుతో కాంగ్రెస్, కాక్రోచ్ పార్టీలు హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు (Sunil Rao) విమర్శించారు. కరీంనగర్లో గురువారం మాట్లాడుతూ… కాక్రోచ్, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న రాజకీయాన్ని దేశ ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. నీట్ పరీక్ష లీకేజీపై కేంద్ర ప్రభుత్వం మే 12 న చర్యలు తీసుకుందని.. తిరిగి 37 రోజుల తర్వాత రీ–ఎగ్జామ్ కూడా పెట్టిందని గుర్తు చేశారు.
పోలీసులపై దాడులు..
దేశంలో 20 లక్షల మంది విద్యార్థులు నీట్ రాస్తే.. అందులో 11 లక్షల మంది క్వాలిఫై అయ్యారని సునీల్ రావు (Sunil Rao) వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఏ కాలేజీల్లో చేరాలని అన్వేషిస్తుంటే.. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ముసుగులో కొందరు ఆందోళనలు ఘర్షణలు, దాడులకు పాల్పడటం దుర్మార్గమన్నారు. 118 మంది పోలీసులపై దాడి చేసి, శాంతియుత ఆందోళన అంటున్నారని మండిపడ్డారు.
మోదీకి వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేకనే..
ప్రధాని నివాసం వద్ద లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆందోళనకు దిగడం సిగ్గు చేటని సునీల్ రావు విమర్శించారు. బండి సంజయ్ అన్నట్లు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం బీజేపి పార్టీకి అదృష్టం అని ఎద్దేవా చేశారు. ఆందోళనలు చేస్తున్న బొద్దింకలకు.. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు సాయం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రపంచ వ్యాప్తంగా మోదీకి వస్తున్న ఆదరణను జీర్ణించుకోలేక… ఇలాంటి హింసాత్మక ఘటనలు, ఆందోళనలు చేపడుతున్నారని విమర్శించారు.
వారిది రహస్య ఎజెండా..
నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ మాదిరి భారతదేశాన్ని కూడా చేస్తామంటున్న కాక్రోచ్ల వ్యాఖ్యలు చేస్తుంటే.. వారి రహస్య ఎజెండా ఏంటో ప్రజలు గమనించాలని సునీల్ రావు పిలుపునిచ్చారు. 55 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఎన్నో పరీక్షల పేపర్లు లీకయ్యాయని.. ఏ మంత్రి రాజీనామా చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పీవీ లాంటి వ్యక్తి చనిపోతే… కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తీసుకురాకుండా అవమాన పరిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా.. కనీసం జాబ్ క్యాలెండర్ ఎక్కడుందని ప్రశ్నించారు.
ఈ మీడియా సమావేశంలో కార్పొరేటర్లు గాజ రామ-శివరాం, ఎన్నం లక్ష్మి-ప్రకాష్, భూపతి రవీందర్, మాసం గణేష్, పొన్నం లక్ష్మి-మొండయ్య గౌడ్, కొలిపాక రమ్మ-శ్రీనివాస్, దేవసాని సరస్వతి-సత్యనారాయణ, కర్రె పద్మ-అనిల్, మేకల వెంకటేష్, వంగల పవన్, కొంపెల్లి శ్వేత-రామణ్, కె.ఎ.పి.పి చంద్ర, కో-ఆప్షన్ మెంబర్ కన్న కృష్ణ, మాజీ కార్పొరేటర్ చంద్రమౌళి, మీడియా ఇన్ఛార్జి లోకేష్, కో ఆప్షన్ మెంబర్ బల్వీర్ సింగ్, మాజీ ఎంపీటీసీ శివ తదితరులు పాల్గొన్నారు.
Read Also: ఢిల్లీలో మళ్లీ హైటెన్షన్.. రాజ్ఘాట్ కు ఇండి కూటమి నేతలు
Follow Us On : WhatsApp

