కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ట్రాన్స్కో డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ముత్యం వెంకటరమణ (Transco DE Mutyam Venkataramana) ఇళ్లు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే నమ్మదగిన సమాచారంతో మాదాపూర్లోని ఆయన నివాసంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 15 ప్రాంతాల్లో 8 ప్రత్యేక ఏసీబీ బృందాలు రైడ్స్ చేపట్టాయి.
వెంకటరమణ ప్రస్తుతం ఖైరతాబాద్లోని రెడ్ కో (TGREDCO)లో డెప్యుటేషన్పై పనిచేస్తున్నారు. ఏసీబీ తనిఖీల్లో వెంకటరమణకు చెందిన భారీగా స్థిరాస్తులను అధికారులు గుర్తించారు. శేరిలింగంపల్లి పరిధిలోని ఖానామెట్ గుట్టల బేగంపేట్లో జీ+5 కమర్షియల్ భవనం, కూకట్పల్లిలో 10 అపార్డ్ మెంట్లు ఉన్నట్లు గుర్తించారు. వెంకటరమణ భార్య పేరుపై నిర్మాణంలో ఉన్న 10 ఫ్లాట్లతో పాటు, మూసాపేట్, శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాల్లో మరో 4 లగ్జరీ రెసిడెన్షియల్ ఫ్లాట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు.
సోదాల సమయంలో వెంకటరమణ ఇంట్లో పెద్ద ఎత్తున నగదు, కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు, అత్యంత విలువైన డైమండ్ జువెల్లరీ లభ్యమైనట్లు సమాచారం. వీటితో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఇంట్లో దాచిన భారీగా విదేశీ మద్యం (ఫారిన్ లిక్కర్) సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెంకటరమణ వాడుతున్న కియా, మహీంద్రా, బాలెనో కార్లను సీజ్ చేశారు. ఈ ఆస్తుల ప్రభుత్వ అధికారిక విలువ దాదాపు రూ.400 కు పై గా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

