కలం, స్పోర్ట్స్: కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) 2026 ప్రారంభంకానున్న వేళ, గతంలో సాధించిన 61 పతకాల రికార్డును అధిగమించాలని భారత్ భావిస్తోంది. అయితే ఈసారి మన క్రీడాకారులకు పతకాల సాధనలో తీవ్రమైన సవాలు ఎదురుకానుంది. ఖర్చులు పెరిగిపోవడంతో ఆస్ట్రేలియాలోని విక్టోరియా నిర్వహణ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో గ్లాస్గో తక్కువ బడ్జెట్తో, కేవలం 10 రకాల క్రీడలతోనే ఈ పోటీలను నిర్వహించడానికి ముందుకు వచ్చింది. దీనివల్ల గతంలో ఉన్న 19 క్రీడల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది.
2022 పోటీలతో పోలిస్తే ఈసారి ఏకంగా తొమ్మిది రకాల క్రీడలను తొలగించారు. వీటిలో భారత్ బాగా రాణించే కుస్తీ (రెజ్లింగ్), బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, మహిళల క్రికెట్ వంటి కీలక ఆటలు ఉన్నాయి. గతంలో బర్మింగ్హామ్లో భారత్ గెలుచుకున్న 61 పతకాలలో, ఈ తొలగించిన క్రీడల నుంచే ఏకంగా 28 పతకాలు రావడం గమనార్హం. కేవలం కుస్తీ నుంచే 12, టేబుల్ టెన్నిస్ నుంచి 7, బ్యాడ్మింటన్ నుంచి 6, హాకీ నుంచి 2, మహిళల క్రికెట్ నుంచి ఒక పతకం లభించాయి. ఈ ముఖ్యమైన ఆటలు లేకపోవడంతో, ఈసారి భారత్ కనీసం 30 పతకాల మార్కును చేరుకోవడం కూడా కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి.
అయినప్పటికీ కొన్ని విభాగాల్లో భారత్కు పతకాల ఆశలు సజీవంగానే ఉన్నాయి. అథ్లెటిక్స్లో జావెలెన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాతో పాటు లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్, ట్రిపుల్ జంప్, హైజంప్ అథ్లెట్లు, , పరుగు పందెంలో పారుల్ చౌదరి, గుల్వీర్ సింగ్ వంటి క్రీడాకారులు పతకాలు సాధించే అవకాశం ఉంది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఒలింపిక్ విజేత మీరాబాయి చానుతో పాటు బింద్యారాణి దేవి, అజయ్ బాబు, జ్ఞానేశ్వరి యాదవ్ మంచి ప్రదర్శన ఇస్తారని ఆశిస్తున్నారు. బాక్సింగ్లో లవ్లీనా బొర్గోహైన్, జైస్మిన్ లాంబోరియాలు పతక రేసులో ముందంజలో ఉన్నారు. వీటితో పాటు జూడో, లాన్ బౌల్స్, పారా స్పోర్ట్స్ విభాగాల్లో కూడా భారత్కు పతకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

