విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన సాగాలి: కలెక్టర్

కలం, నిర్మల్ : ఐఐఐటి విద్యార్థులు విద్య పూర్తిచేసి బయటకు వెళ్లే నాటికే మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందేలా నైపుణ్యాభివృద్ధి ఆధారిత విద్యాబోధన చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. బుధవారం బాసర ఐఐఐటి క్యాంపస్‌ను సందర్శించి, విశ్వవిద్యాలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యాలను పెంపొందించేలా విద్యా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

ఆధునిక సాంకేతికతను సమర్థంగా వినియోగించి, విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలకు పోటీపడే స్థాయికి తీర్చిదిద్దాలని తెలిపారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల సమస్యలు ఏవైనా దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు.

అకాడమిక్, డిజిటల్, క్రీడా సదుపాయాల విస్తరణతో పాటు విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. క్యాంపస్‌కు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. అనంతరం బాసరలో ప్రతిపాదిత నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించి, అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఐఐఐటి ఉపకులపతి గోవర్ధన్, ఓఎస్డీ మురళీ దర్శన్, తహసీల్దార్ పవన్ చంద్ర, విశ్వవిద్యాలయ అధికారులు, పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>