కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆధ్వర్యంలో కొడంగల్లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొడంగల్ నియోజకవర్గ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి, స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన భారీ నిరసన ర్యాలీలో స్వయంగా పాల్గొన్నారు.
ఢిల్లీలో విద్యార్థుల సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుపై జరిగిన ఈ దాడిని దేశ ప్రజలు గమనిస్తున్నారని, నిర్బంధాలు, జైళ్లతో కాంగ్రెస్ పోరాటాన్ని ఆపలేరని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన ఈ నిరసన ర్యాలీలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

