కలం, వెబ్ డెస్క్: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చలు జరిపినప్పటికీ, ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీతో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఘాటుగా స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తుపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని, అందుకే చర్చల నుంచి వెనకడుగు వేసిందని పరోక్షంగా మోదీపై విమర్శలు గుప్పించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు.

