కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని.. అడ్డుగా ఉన్న భర్తను చంపింది ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు (Government Teacher). నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మారుతి నగర్ కాలనీలో లక్ష్మణ్ నాయక్(38), పద్మ(30) దంపతులు నివాసం ఉంటున్నారు. గత నెల 25న లక్ష్మణ్ నాయక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో అతని తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో భార్య పద్మను నిందితురాలుగా పోలీసులు గుర్తించారు.
2024లో డీఎస్సీలో ఎంపికై ఉప్పునుంతల మండలం బట్టుకాడిపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో పద్మకు, తాడూరు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న రాత్లావత్ గోపి అనే ఉపాధ్యాయుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపాలనుకుంది. గోపి సాయంతో గతనెల 24న రాత్రిన నిద్రిస్తున్న లక్ష్మణ్ నాయక్ ముక్కు, నోటిఫై గుడ్డతో ఊపిరాడకుండా చంపేసింది పద్మ.
మర్నాడు ఉదయం ఏమి తెలియనట్లు పాఠశాలకు వెళ్లింది. ఇంటి యజమానికి ఫోన్ చేసి, తన భర్త ఎంత ఫోన్ చేసినా ఎత్తడం లేదని, తనకు భయంగా ఉందని నటించింది. దీంతో లక్ష్మణ్ నాయక్ తమ్ముడికి అనుమానం వచ్చి పోలీసులకు (Police) ఫిర్యాదు చేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి, అక్రమ సంబంధం వల్లే హత్య జరిగిందని తేల్చారు. వాస్తవాలను రాబట్టి పద్మ, గోపిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.


