కలం, వెబ్డెస్క్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారేలో రోకో (Rohit Kohli )సెంచరీలతో ఘనంగా పునరాగమనం చేశారు. తమ తమ జట్లకు ఘన విజయం సాధించిపెట్టారు. భారత జాతీయ జట్టులోని ప్రతి సభ్యుడు విజయ్ హజారేలో కనీసం రెండు మ్యాచ్లు కచ్చితంగా ఆడాల్సిందేనని ఇటీవల బీసీసీఐ నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చాలా ఏళ్ల తరువాత రోహిత్, కోహ్లీ విజయ్ హజారేలో ఆడారు. తాము ఎంతటి విలువైన ఆటగాళ్లో చాటి చెబుతూ శతకాలతో చెలరేగి తమ తమ జట్లను గెలిపించారు. అభిమానులకు ఆనందాన్ని, సెలెక్టర్లో నమ్మకాన్ని నింపారు.
16 వేల పరుగులు పూర్తి..:
బెంగళూరు వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో తొలుత ఆంధ్రప్రదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 258 పరుగులు చేసింది. ఏపీ జట్టులో రికీ భుయ్ సెంచరీ (122; 105 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్లు) చేశారు. అనంతరం ఛేదనలో ఢిల్లీ జట్టు విరాట్ కోహ్లీ(131; 101 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీతో చెలరేగాడు. నితీశ్ రాణా(77), ప్రియాంశ్ ఆర్య(74) అర్ధసెంచరీలతో రాణించారు. దీంతో ఢిల్లీ జట్టు 12 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యం చేరుకుంది. ఈ మ్యాచ్ ద్వారా కోహ్లీ లిస్ట్–ఎ క్రికెట్లో 16వేల పరుగులు పూర్తి చేసుకొని, సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ ఘనత సాధించి రెండో క్రికెటర్గా నిలిచాడు.
రోహిత్ రెండో శతకం..:
జైపూర్ వేదికగా సిక్కింతో జరిగిన మ్యాచ్లో హిట్మ్యాన్ రోహిత్ శర్మ(155; 94 బంతుల్లో 18 ఫోర్లు, 9సిక్స్లు) భారీ సెంచరీ బాదడంతో ముంబై జట్టు 30.3 ఓవర్లలోనే 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. సెంచరీని 61 బంతుల్లోనే పూర్తిచేసుకున్న రోహిత్కు 17 ఏళ్ల విజయ్ హజారే కెరీర్లో ఇది రెండో సెంచరీ మాత్రమే కావడం విశేషం.
తొలిరోజు రికార్డుల మోత.:
విజయ్ హజారే ట్రోఫీ తొలి రోజు భారీ స్కోర్లు, శతకాలు, రికార్డుల మోత మోగింది. ఒకేరోజు 20కి పైగా సెంచరీలు నమోదయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్తో మ్యాచ్లో బిహార్ చిచ్చర పిడుగు, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లోనే శతకం బాది రికార్డు సృష్టించాడు. తద్వారా లిస్ట్ క్రికెట్లో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన క్రికెటర్గా రికార్డులకు ఎక్కాడు. సూర్యవంశీ (190; 84 బంతుల్లో 16 ఫోర్లు, 15 సిక్స్లు)కి తోడు ఆయుష్ లోహరుక(116), సకిబుల్ ఘని(128) సెంచరీలు చేయడంతో బిహార్ జట్టు విజయ్ హజారేలో రికార్డు స్కోరు 574/6 సాధించింది. ఘని సెంచరీ సైతం (32 బంతుల్లో) రికార్డులకెక్కింది. ఒడిశాతో మ్యాచ్లో సౌరాష్ట్ర ఆటగాడు సాత్విక్ సమాల్ డబుల్ సెంచరీ (212; 169 బంతుల్లో 21 ఫోర్లు, 8సిక్స్లు) బాదాడు. కాగా, రోకో (Rohit Kohli) ఆడిన మ్యాచ్లు చూడడానికి అభిమానులు పోటెత్తారు.
హైదరాబాద్ పరాజయం:
రాజ్కోట్ వేదికగా యూపీతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 84 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన యూపీ 50 ఓవర్లలో 324/5 పరుగులు చేసింది. అభిషేక్ గోస్వామి(81), ఆర్యన్ జుయెల్(80), ధ్రువ్ జురెల్(80), రింకూ సింగ్(67) అర్ధసెంచరీలు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో అర్ఫాన్ అహ్మద్ 2 వికెట్లు తీయగా, నితిన్ సాయి యాదవ్, తనయ్ త్యాగరాజన్, రక్షణ్ రెడ్డి తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో హైదరాబాద్ 43 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్(53) అర్ధ సెంచరీ చేయగా, రాహుల్ బుద్ధి(47), వరుణ్ గౌడ్(45), రాహుల్ సింగ్(32) పరుగులు చేశారు. యూపీ బౌలర్లలో జీషాన్ అన్సారీ 4,ప్రశాంత్ వీర్ 3, కార్తిక్ త్యాగి 2 వికెట్లు తీశారు.


