కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం(Khammam) నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది (Outsourcing Workers) పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం భారీ ఆందోళన చేపట్టారు. కార్మిక ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో భాగంగా కార్మికులు విధులను బహిష్కరించి నగరపాలక సంస్థ కార్యాలయం (Municipal Corporation) ఎదుట బైఠాయించారు. కార్మికుల సమ్మెతో నగరంలో పారిశుద్ధ్య పనులు పూర్తిగా నిలిచిపోయాయి. పలు ప్రాంతాలలో చెత్త సేకరణ, శుభ్రత పనులకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా ఐకాస నాయకులు మాట్లాడుతూ.. ప్రతి నెల ఒకటో తేదీన కార్మికుల ఖాతాలలో వేతనాలు జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటికీ జీతాలు అందక కార్మిక కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
అవుట్సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, గుత్తేదారుల ద్వారా పనిచేస్తున్న కార్మికులకు సెలవు సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల ఆందోళనతో ఖమ్మం కార్పొరేషన్ (Khammam Corporation) కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న సహాయ కమిషనర్ అనిల్ కుమార్ అక్కడికి చేరుకుని కార్మికులతో చర్చలు జరిపారు. పెండింగ్లో ఉన్న వేతనాల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు.
,Read Also: షాబాద్ ఆరు హత్యల నిందితుడు రాజ్ కుమార్ మృతి
Follow Us On : WhatsApp

