కలం, ఖమ్మం బ్యూరో: ఏపీ సీఎం చంద్రబాబుకు ఉన్న నీటి సోయి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వం కాళేశ్వరంలో నీరు ఎత్తకుండా కిందకు వదిలేయడంతో.. చంద్రబాబు ప్రభుత్వం ఎత్తిపోసుకుని పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తోందన్నారు. ఇకనైనా రేవంత్ రెడ్డి సోయి తెచ్చుకోవాలని హితవు పలికారు.
ఓట్లేసింది అందుకేనా..?
కాళేశ్వరం నీటిని సద్వినియోగం చేసుకోకపోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పువ్వాడ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది ఇక్కడి నీటిని ఆంధ్రప్రదేశ్కు ధారాదత్తం చేయడానికి కాదని మండిపడ్డారు. ఇప్పటికైనా రేవంత్ మేల్కొని, చంద్రబాబు తరహాలోనే నీటిపై శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. ఎగువన తెలంగాణ పరిధిలో నీటిని ఎత్తిపోసి రైతులకు సాగునీరు అందించాలని పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.

