కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా షాబాద్లో (Shabad Murder Case) ఆరుగురిని దారుణంగా హత్య చేసిన పోక్సో కేసు నిందితుడు ఉన్మాది రాజ్కుమార్ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ దారుణ ఘటనకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం తక్షణ చర్యలకు ఆదేశించింది. ఇందులో భాగంగానే విధుల్లో నిర్లక్ష్యం వహించిన సీఐ, ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు పడింది. కాగా, నిందితుడు రాజ్కుమార్ను పోలీసులు ఇప్పటికే రహస్య ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారని, విచారణ అనంతరం అతడిని ఎన్కౌంటర్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ విషయమై చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ఈ వదంతులను ఖండించారు. నిందితుడు తమ అదుపులో లేడని, అతడి ఆచూకీ కోసం 9 ప్రత్యేక బృందాలతో అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా, నిందితుడి సమాచారం అందించిన వారికి 2 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించిన పోలీసులు ఎన్కౌంటర్ వదంతులను నమ్మవద్దని తెలిపారు.

