కలం, వెబ్ డెస్క్ : స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్య మహిళలను అక్షరాస్యులుగా మార్చేందుకు మెప్మా (MEPMA) సరికొత్తగా ‘అమ్మకు అక్షరమాల’ (Ammaku Aksharamala) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా నగరపాలక సంస్థతో పాటు మూడు పురపాలక సంఘాల పరిధిలో నిర్వహించిన సమగ్ర సర్వేలో 3,254 మంది నిరక్షరాస్య మహిళలను అధికారులు గుర్తించారు. వీరందరికీ ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులు, రిసోర్స్ పర్సన్ల (RP) ద్వారా అక్షరాలు, అంకెలను నేర్పించనున్నారు.
ఈ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు రాబోయే ఆగస్టు నెలలో 5వ తరగతి సమాన ప్రాథమిక పరీక్షను నిర్వహించి, ఉత్తీర్ణులైన వారికి ప్రభుత్వ అధికారిక ధ్రువపత్రాలను అందజేస్తారు. ఆ తర్వాత కేవలం మూడు నెలల వ్యవధిలోనే వారిని 10వ తరగతి పరీక్షలకు సిద్ధం చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా బ్యాంకు లావాదేవీలు, పొదుపు సంఘాల రుణాల నిర్వహణలో పారదర్శకతను పెంచడం, మహిళలు వేలిముద్రలకు బదులుగా సొంతంగా సంతకాలు చేసేలా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

