కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లి, చెట్ల గౌరరం గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ ఇంచార్జ్ వంటేరు ప్రతాప రెడ్డి ఒక్క రోజు నిరాహార దీక్ష (Protest) చేపట్టారు. కాలుష్య కారక పరిశ్రమల వల్ల స్థానిక గ్రామ ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ గ్రామస్తులతో కలిసి దీక్షకు దిగారు.
ఆయనకు మద్దతుగా రెండు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొన్నారు. పరిశ్రమ వల్ల గ్రామ ప్రజలకు కాలుష్య సమస్యలు, దురద, క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. పరిశ్రమను వెంటనే గ్రామం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. పరిశ్రమ వల్ల ప్రజలకు పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని, వికలాంగులుగా మారుతున్నారని, ప్రతిరోజు తీవ్ర అనారోగ్య సమస్యలతో నరకం అనుభవిస్తున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

