కలం, వెబ్ డెస్క్: కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న మిడిల్ ఈస్ట్లో మళ్లీ ఉద్రిక్తతలు మొదలవుతున్నాయి. ఇరాన్ (Iran)తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని ప్రకటించిన అమెరికా (US) ఇరాన్పై వైమానిక దాడులు (Airstrikes) ప్రారంభించింది. ఈ దాడులతో రెండు రోజుల్లోనే 14 మంది మృతి చెందారని, మరో 78 మంది గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అమెరికా దాడులు ఇలాగే కొనసాగితే భారీగా ప్రాణ నష్టం సంభవిస్తుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ దాడుల్లో గాయపడిన వారిలో 47 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మిగిలిన వారు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వెల్లడించారు. ఇరాన్ వైమానిక స్థావరాలు, క్షిపణి లాంచర్లు, వంతెనలను టార్గెట్గా చేసుకుని అమెరికా సెంట్రల్ కమాండ్ దాదాపు 90 ప్రాంతాలపై దాడులు చేపట్టింది. ఇరాన్ అణు విద్యుత్ ప్లాంట్ ఉన్న బుషెహర్తో పాటు పలు దక్షిణ నౌకాశ్రయ నగరాల్లో ఈ పేలుళ్లు సంభవించాయి.
హోర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన రవాణాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దనే ఈ దాడులు చేసినట్లు అమెరికా సైన్యం స్పష్టం చేసింది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా ధీటుగా స్పందించింది. గల్ఫ్ దేశాలపై క్షిపణులతో ఎదురుదాడికి దిగింది. ఈ పరస్పర దాడులతో మిడిల్ ఈస్ట్లో పరిస్థితులపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన పెరుగుతున్నది.

