కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఎల్ నినో ప్రభావం వల్ల ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని రైతులకు అనువైన పంటల సాగుపై (Wanaparthy Agriculture) అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) ఆదేశించారు. గురువారం రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం వల్ల ఇప్పటి వరకు జిల్లాల వారీగా కురిసిన వర్షాలు, రిజర్వాయర్ లో ఉన్న నీటి లభ్యత, రైతులకు ఇవ్వాల్సిన సూచనలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో ఇప్పటి వరకు లోటు వర్షపాతం నమోదు అయ్యాయని, రానున్న మూడు నెలలు సైతం ఆశించిన స్థాయిలో వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ నివేదికలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి రైతులకు పంట మార్పిడిపై తగిన సూచనలు, సలహాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లను సూచించారు.
ఇరిగేషన్, వ్యవసాయ అధికారులతో సమీక్ష..
అనంతరం జిల్లాలోని ఇరిగేషన్, వ్యవసాయ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జూరాల, రామన్ పాడ్ రిజర్వాయర్ లో ఉన్న నీటి నిల్వలు, రిజర్వాయర్ లోకి వస్తున్న నీటిపై ఇరిగేషన్ అధికారులకు వివరాలు అడిగారు. ప్రస్తుతం జూరాలకు పై నుండి ఎలాంటి నీటి ప్రవాహం లేవని, మహారాష్ట్ర కర్ణాటకలో వర్షాలు బాగా పడితే ఆల్మట్టి నుండి నీరు వదిలితే కాస్త వచ్చే అవకాశం ఉందని.. అవి తాగు నీటికి సరిపోతుందని ఇరిగేషన్ సీఈ రహిమొద్దీన్ వివరించారు.
దీనిపై స్పందించిన కలెక్టర్.. నీటి లభ్యత, ఎల్ నినో ప్రభావం దృష్టా మండలాల వారిగా రైతులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేసే విధంగా అవగాహన కల్పించాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. బోరు ఉండి రెండెకరాలకు పైన ఉన్న రైతులు పామాయిల్ పంట సాగు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మినుములు, కందులు వంటి ఇతర పంటలు సాగు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, ఇరిగేషన్ సీఈ రహీముద్దీన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు, ఉద్యానవన శాఖ అధికారి విజయ భాస్కర్, ఇరిగేషన్ ఈఈలు, డీఈలు, తదితరులు పాల్గొన్నారు.

