కలం, వెబ్ డెస్క్ : మేకిన్ ఇండియాలో భాగంగా 6జీ దిశగా భారతదేశం పయనిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. అస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న ప్రధాని మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో జరిగిన భారతీయ ప్రవాసుల కార్యక్రమంలో ప్రసంగించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్తో కలిసి మెల్ బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రవాస భారతీయులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
భారతీయ పండుగలను ఆస్ట్రేలియా ప్రజలు జరుపుకుంటారని.. మెల్ బోర్న్ మినీ ఇండియాగా మారిందన్నారు. 21వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారాలనే లక్ష్యం దిశగా కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.భారత్ లో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలు ఉన్నాయని మోదీ గుర్తు చేశారు. త్వరలో స్పేస్ స్టేషన్ ను భారత్ నిర్మించబోతోందని.. గగన్ యాన్ ను పంపేందుకు భారత్ సన్నద్ధమవుతోందని ప్రకటించారు. భవిష్యత్ అంతా యువతదేనని చెప్పారు.
ప్రవాస భారతీయుల ఉత్సాహం, శక్తి అమోఘమని కొనియాడిన మోదీ, భారత్-ఆస్ట్రేలియా స్నేహానికి వారే బలమైన స్తంభాలని ప్రశంసించారు. తాజా పర్యటన ఫలితాలు ఇరుదేశాలు ఉజ్వల భవిష్యత్తు వైపు నమ్మకంతో అడుగులు వేస్తున్నాయనడానికి నిదర్శనమని, కలిసికట్టుగా వృద్ధి, ఆవిష్కరణల వైపు సాగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

