కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ (Fauzi Movie Shoot) సందర్భంగా.. ప్రముఖ నటుడు రాజేష్ శర్మకు (Actor Rajesh Sharma) విషపురుగు కాటు వేసిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ వార్తలపై ఆయన పీఏ సుభాశిష్ పాండా స్పందిస్తూ అసలు విషయాన్ని వెల్లడించారు. సుభాశిష్ పాండా విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ..
రాజేష్ శర్మకు ఎలాంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్ లేదు. చాలా కాలంగా ఉన్న షుగర్ కారణంగా ఆయన కాలుకు కొద్దిగా వాపు వచ్చింది. వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేర్పించాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. మరో ఒకటి, రెండు రోజులలో డిశ్చార్జ్ అవుతారు” అని తెలిపారు. అలాగే, రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ సమయంలో విషపురుగు కాటుకు గురయ్యారన్న వార్తలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. “రాజేష్ శర్మ ఎక్కడికి వెళ్లినా నేను ఆయనతోనే ఉంటాను. హైదరాబాద్లో అలాంటి ఘటన ఏదీ జరగలేదు. నిజానిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ను షేర్ చేయవద్దని, అధికారిక సమాచారం వచ్చినప్పుడే నమ్మాలని సుభాశిష్ పాండా విజ్ఞప్తి చేశారు.

