కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాను రానున్న కరువు, సంక్షోభం నుండి రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక ‘ఎల్నినో టాస్క్ఫోర్స్’ (El Nino Task Force) ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
వాతావరణ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజల కోసం ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని అందులో పేర్కొన్నారు. అలాగే సమస్యలు వచ్చిన తర్వాత స్పందించడం కాకుండా, ముందస్తు ప్రణాళికతో నష్టాన్ని నివారించడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో ఎల్నినో (El Nino) వల్ల వర్షపాతం తగ్గితే రైతులు, పశుపోషకులు తీవ్రంగా నష్టపోతారని పువ్వాడ (Puvvada Ajay) ఆందోళన వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్, గోదావరి, మున్నేరు వంటి వనరులపై ఆధారపడిన ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి రాకుండా చూడాలన్నారు. ఇందుకోసం చెరువుల పూడికతీత, మిషన్ భగీరథ వసతుల నిర్వహణ, ప్రత్యామ్నాయ తాగునీటి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
అలాగే, వర్షాభావ పరిస్థితులకు అనుకూలమైన పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పంటల బీమాతో పాటు పశుగ్రాస నిల్వలను అందుబాటులో ఉంచాలన్నారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సరఫరాను క్రమబద్ధీకరించాలని, అన్ని శాఖల సమన్వయంతో జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయాలని పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.
Read Also: అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ వాళ్లకు చుక్కలు చూపిస్తాం: హరీశ్ రావు
Follow Us On : WhatsApp

