కలం, వెబ్ డెస్క్: అవినీతి అధికారులపై తెలంగాణ ఏసీబీ (ACB) కొరడా ఝులిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఏసీబీ వరుస దాడుల్లో పలువురు భారీ అవినీతి తిమింగలాలు చిక్కిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లాలోని ఐడీఓసీ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ గ్రామానికి సంబంధించిన మ్యాప్ మార్చేందుకు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర రెడ్డిని కొందరు వ్యక్తులు కోరారు.
దీనికి సంబంధించిన ఫైల్ను ఉన్నతాధికారులకు పంపించేందుకు వెంకటేశ్వర రెడ్డి బాధితుల నుంచి రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో వారు ఏసీబీని ఆశ్రయించారు. సూపరింటెండెంట్ తీరుపై అధికారులకు వివరించారు. దీంతో అధికారులు ప్లాన్ ప్రకారం మహబూబ్నగర్లోని ఐడీఓసీ కార్యాలయానికి చేరుకున్నారు. వెంకటేశ్వర రెడ్డి బాధితుల నుంచి లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
Read Also: ‘వివరణ ఇచ్చేదే లేదు’.. మంత్రి సురేఖకు కడియం కౌంటర్!
Follow Us On: X(Twitter)

