కలం, కరీంనగర్ బ్యూరో: సింగరేణి సంస్థ హక్కుల పరిరక్షణ కోసం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ గడ్డం (MP Vamsi Krishna) అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలోనే తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి సింగరేణి సంస్థకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పామని, సింగరేణి ప్రయోజనాల కోసం పార్లమెంట్లో పోరాడతామని హామీ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు.
ఆ హామీకి అనుగుణంగానే గత రెండు సంవత్సరాలుగా సింగరేణి సంస్థకు హక్కుగా రావాల్సిన కోల్ బ్లాక్ల కేటాయింపుపై నిరంతరం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చామని తెలిపారు. ఈ క్రమంలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డిని పలుమార్లు కలిసి తాడిచెర్ల కోల్ బ్లాక్–2ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)కు కేటాయించాలని విజ్ఞప్తి చేశామని, అదే అంశంపై పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తి సింగరేణి కార్మికుల గొంతుకగా నిలిచామని పేర్కొన్నారు.
తాజాగా కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల కోల్ బ్లాక్–2ను సింగరేణికి కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన వంశీ కృష్ణ గడ్డం (MP Vamsi Krishna), ఇది సింగరేణి సంస్థకు మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కూడా ఎంతో కీలకమైన నిర్ణయమని అన్నారు. ఈ కేటాయింపుతో సింగరేణి సంస్థ బలోపేతం కావడంతో పాటు వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని తెలిపారు.
“ఇది కేవలం కోల్ బ్లాక్ కేటాయింపు మాత్రమే కాదు.. సింగరేణి కార్మికుల పోరాటానికి దక్కిన విజయం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు లభించిన గౌరవం. సింగరేణి హక్కులు, కార్మికుల సంక్షేమం కోసం మా పోరాటం భవిష్యత్తులో కూడా ఇదే నిబద్ధతతో కొనసాగుతుంది.” అని పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ గడ్డం స్పష్టం చేశారు.
Read Also: ‘వివరణ ఇచ్చేదే లేదు’.. మంత్రి సురేఖకు కడియం కౌంటర్!
Follow Us On: Instagram

