కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ 8వ డివిజన్, అలుగునూర్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో గల పంచముఖ, రామ సాయి దేవాలయ16వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో పంచముఖ ఆంజనేయస్వామి, రామ నామస్మరణతో మార్మోగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాల్లో భక్తులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు.
ఆలయ వార్షికోత్సవం సందర్భంగా వేద పండితులు తిరునగిరి వెంకటాద్రి స్వామి, తిరునగిరి హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ఉదయం నుంచే విశేష పూజా కార్యక్రమాలు ప్రత్యేక హోమం, అభిషేకాలను శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ దేవాలయ వార్షికోత్సవ వేడుకలకు మేయర్ కోలగాని శ్రీనివాస్ హాజరై, ఆలయంలోని దైవ సన్నిధిలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ బాధ్యులు మేయర్ కోలగాని శ్రీనివాస్ ను సత్కరించారు. వేద పండితులు మేయర్ శ్రీనివాస్ కు ఆశీర్వచనం అందించారు. అలాగే వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీపీ కుంట రాజేందర్, మహాత్మా నగర్ గ్రామ సర్పంచ్ పొన్నాల సంపత్ ను ఆలయ కమిటీ సన్మానించింది.
స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో దేవాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు తగు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని అత్యంత భక్తిపూర్వకంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకలు ఆధ్యాత్మిక శోభతో విజయవంతంగా ముగిశాయి.
ఈ కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయ ధర్మకర్తల సేవా సమితి అధ్యక్షులు చిందం నరసయ్య, గడప శేఖర్, సిరిపురం శ్రీనివాస్, సల్ల రాజయ్య, సల్ల మల్లేశం, సుధాకర్ రెడ్డి, మృత్యుంజయం, బండి కుమార్, బూట్ల కరుణాకర్, కొట్టాల శ్రీనివాస్, చిందం అంజి, చిందం మనోహర్, మధు, కొత్తూరీ శ్రీనివాస్, సిద్దయ్యలతోపాటు మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

