కలం, తెలంగాణ బ్యూరో : కన్నెపల్లి పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti )ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కే లేదన్నారు. కేవలం కమీషన్ల కోసమే బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని, కానీ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మాత్రం పేదల నివాసం కోసం ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నదని తెలిపారు.
ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన అనంతరం ప్రకటన విడుదల చేసిన పొంగులేటి.. పేదలకు ఇండ్లు కట్టిస్తే కమీషన్ రాదని తెలిసినా తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. భారీ ప్రాజెక్టులు కడితే కమీషన్లు వస్తాయని తెలిసినా తాము తలొగ్గలేదన్నారు. కానీ, బీఆర్ఎస్ నాయకులు మాత్రం కమీషన్లు వచ్చే భారీ ప్రాజెక్టులనే ఎంచుకున్నదని, కమీషన్లు రానందునే పేదలకు గూడు కల్పించే ఇండ్ల నిర్మాణంపై దృష్టి పెట్టలేదని తెలిపారు.
కమీషన్ల కోసమే ఆరాటపడ్డారు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్ఎస్ లీడర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కమీషన్ల కోసమే ఆరాటపడ్డారని, అందుకే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు దెబ్బతిన్నాయని, ఇప్పుడు రిపేర్లు చేయాల్సిన అవసరం వచ్చిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా కేటీఆర్ మాట్లాడడం సరికాదన్నారు. అబద్ధాలతో రాజకీయ లబ్ధి పొందాలని చేసే ప్రయత్నాలు ఫలించవని, ప్రజల రక్తాన్ని, చెమటను దోచుకుని వేల కోట్ల అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్కు పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు.

