కలం, తెలంగాణ బ్యూరో : యూరియా విక్రయాల్లో గోల్మాల్ జరగకుండా, బ్లాక్ మార్కెట్కు తరలకుండా, ఎక్కువ ధరకు రైతులు కొనాల్సిన పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఫెర్టిలైజర్ యాప్’ మంచి ఫలితాలను ఇస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Thummala Nageswara Rao) వ్యాఖ్యానించారు. ఆధునిక టెక్నాలజీతో అక్రమాలను నివారించడమే కాకుండా రైతులకూ అందుబాటులోకి తెచ్చామన్నారు.
మీడియాతో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తొలి రోజుల్లో యాప్ పట్ల అవగాహన లేక ఆందోళనపడ్డారని, ఇప్పుడు రైతుల నుంచి మంచి స్పందన వస్తున్నదని తెలిపారు. ఇప్పటివరకు 17.70 లక్షల మంది రైతులు యాప్ ద్వారా మొత్తం 59.78 లక్షల బ్యాగుల యూరియాను బుక్ చేసుకుంటే అందులో 52.86 లక్షల బ్యాగుల డెలివరీ చేశామని చెప్పారు. దాదాపు 2.52 లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని, రాష్ట్రం దగ్గర ఇంకా 3.39 లక్షల టన్నులు అందుబాటులో ఉందన్నారు. యాప్ వచ్చిన తర్వాత యూరియా పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట పడిందని, ప్రతీ రోజూ జిల్లాల వారీగా యూరియా బులెటిన్లు విడుదల చేస్తామని వివరించారు.

