కలం, నిర్మల్: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఓ వలస కార్మికుడు (Migrant Worker) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నిర్మల్ (Nirmal) జిల్లా సారంగాపూర్ మండలం వైకుంఠాపూర్ గ్రామానికి చెందిన లగ్గం జగదీశ్ ఉపాధి నిమిత్తం యూఏఈలోని దుబాయ్కు వెళ్లాడు. గత నెల 21వ తేదీన అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. జగదీశ్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు.
విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు, ఎన్ఆర్ఐ సెల్ అధికారులతో సమన్వయం చేసి మృతదేహాన్ని భారతదేశానికి తరలించేలా చర్యలు చేపట్టారు. ఆదివారం దుబాయ్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మృతదేహం చేరుకోగా, అనంతరం స్వగ్రామమైన వైకుంఠాపూర్కు తరలించారు. గ్రామంలో బంధుమిత్రులు, గ్రామస్తుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు.
జగదీశ్ మృతదేహాన్ని చూసిన ఆయన భార్య, చిన్నారులు, కుటుంబ సభ్యులు బోరున విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. గ్రామమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు జగదీశ్కు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న జగదీశ్ అకాల మరణంతో వారి జీవితం దుర్భరంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని తగిన ఆర్థిక సాయం అందించాలని వారు కోరారు.

