కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లాలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. వరంగల్ భద్రకాళి దేవాలయ (Bhadrakali Temple) ప్రధాన ద్వారం ఎదుట ఒక వ్యక్తి ప్లకార్డు పట్టుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ‘ఓ రాజకీయ నాయకుల్లారా.. భద్రకాళి అమ్మవారి సన్నిధిలో రాజకీయాలు కాదు, ఆధ్యాత్మికత, ఐక్యత, భక్తి మాత్రమే ఉండాలి. దేవాలయ పవిత్రతను కాపాడుదాం’ అంటూ ఆ ప్లకార్డుపై రాసి ఉంది.
పవిత్రమైన గుడి ప్రాంగణాలను రాజకీయ వేదికలుగా మార్చవద్దని, భక్తిభావంతో వచ్చే సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించకుండా ఆలయ విశిష్టతను కాపాడాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ నిరసనకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతున్నాయి.
ఇటీవల వరంగల్ ‘కుడా’ భూముల వేలం వివాదంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య జరిగిన రాజకీయ ఘర్షణ తెలిసిందే. అవినీతి ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు భద్రకాళి అమ్మవారి సన్నిధికి వచ్చి తడిబట్టలతో ప్రమాణాలు చేయడం, ఆ తర్వాత ఆలయ పవిత్రత దెబ్బతిన్నదంటూ బీజేపీ శ్రేణులు పసుపు నీళ్లతో ఆలయ శుద్ధి కార్యక్రమానికి యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే.

