కలం, ఖమ్మం బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అనేక విద్యాసంస్థలు మూతపడుతున్నాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఖమ్మం నగరంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఫీజు రీ ఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు.
డబ్బులు లేవంటూ అవి ఎలా..?
హక్కుల కోసం ప్రశ్నించిన కళాశాలలను ముఖ్యమంత్రి స్వయంగా బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఫలితంగానే రాష్ట్రంలో విద్యాసంస్థలు మూసివేసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తుతో ముడిపడిన ఫీజు రీ ఎంబర్స్మెంట్ బకాయిలు రూ. 9 వేల కోట్లు లేవని ప్రభుత్వం చెబుతోందన్నారు. మరి రూ.లక్ష కోట్లు పెట్టి మూసీ ప్రాజెక్ట్, ఫ్యూచర్ సిటీలను ఎలా ప్రారంభిస్తోందని నిలదీశారు.
ఇచ్చింది రూ.600 కోట్లే..
కేసీఆర్ హయాంలో కరోనా సమయంలో ఫీజులు సాఫీగా చెల్లించామని పువ్వాడ గుర్తు చేశారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో కేవలం ఇచ్చిన బకాయిలు రూ. 600 కోట్లు మాత్రమేనని విమర్శించారు. అది కూడా యాజమాన్యాలు సమ్మెకు దిగి, కోర్టులను ఆశ్రయిస్తేనే ఇచ్చారన్నారు. దసరాకు కొంత, దీపావళికి కొంత అంటూ బోనస్ల రూపంలో ఆఫర్లు పెట్టడం హాస్యాస్పదమన్నారు. ఈ అంశాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా చేపడతామని, విద్యార్థి సంఘాలు, వామపక్షాలతో ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.

