కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లాలో నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్నవారి బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసిందని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య గురువారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,98,513 మంది రైతులకు రూ. 255.75 కోట్లను వేసిందని పేర్కొన్నారు.
అధికంగా మధిర నియోజకవర్గ రైతులకు..
నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. మధిరలో 78,832 మంది రైతులకు రూ.66.28 కోట్లు, సత్తుపల్లిలో 74,682 మంది రైతులకు రూ.62.19 కోట్లు జమ అయ్యాయి. పాలేరులో 71,029 మంది రైతులకు రూ.58.08 కోట్లు, వైరాలో 56,673 మంది రైతులకు రూ.53.78 కోట్లు, ఖమ్మంలో 16,197 మంది రైతులకు రూ.14.69 కోట్లు విడుదలయ్యాయి. అలాగే ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని కామేపల్లి మండలానికి చెందిన 1,100 మంది రైతులకు రూ.73 లక్షలు ఖాతాల్లో జమ అయినట్లు తెలిపారు.
పెట్టుబడి సాయం సకాలంలో అందడంతో సాగు పనులను వేగవంతంగా చేపట్టేందుకు ఎంతగానో దోహదపడుతుందని జిల్లా వ్యవసాయ అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంకు ఖాతాలను పరిశీలించుకుని, రైతు భరోసా మొత్తాన్ని నిర్ధారించుకోవాలన్నారు. సందేహాలు ఉంటే సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చని సూచించారు. అర్హులైన ప్రతి రైతుకు ప్రయోజనం అందేలా వ్యవసాయ శాఖ నిరంతరం చర్యలు తీసుకుంటుందని ధనసరి పుల్లయ్య స్పష్టం చేశారు.

