కలం, వెబ్ డెస్క్ : అమరావతి vs మావిగన్ అంటూ కొత్త రాజకీయ స్లోగన్ ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan).. తాజాగా మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజధానిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబాన్ని పరమర్శించేందుకు విజయవాడ వచ్చిన వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి (Amaravati) కాదని, విజయవాడే (Vijayawada) అసలైన రాజధానిగా వ్యవహరించబడుతోందని జగన్ వ్యాఖ్యానించారు.
సీపీ, డీజీపీ, ముఖ్యమంత్రి, హోంమంత్రి కార్యాలయాలు అన్నీ విజయవాడలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి కీలక పరిపాలనా కేంద్రంలోనే క్రాంతి కుమార్పై వేధింపులు జరిగాయని జగన్ ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి.

