కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అప్పులపై హైదరాబాద్ రైతు భరోసా వేదికగా గత బీఆర్ఎస్ సర్కార్పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జూన్ 2, 2014న తెలంగాణ ఏర్పడినప్పుడు ఉన్న అప్పు రూ. 69 వేల కోట్లు మాత్రమేనని.. 2023 డిసెంబర్ 7న ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో రూ. 8 లక్షల 11 వేల కోట్ల అప్పు అయిందని మండిపడ్డారు. 60 ఏళ్లలో 69 వేల కోట్ల అప్పులు చేస్తే.. కేవలం కల్వకుంట్ల కుటుంబం 7 లక్షల కోట్లకుపైగా అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నిండా ముంచిందని ఫైర్ అయ్యారు. మళ్లీ లేవడానికి వీలులేకుండా అప్పులతో మన్ను కప్పారని మండిపడ్డారు. అన్ని రకాల అప్పులను తవ్వితే గుట్టల కొద్ది విషయాలు బయటపడ్డాయని.. అందినకాడికి దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున కాకుండా విడతల వారీగా జీతాలు ఇచ్చారని విమర్శించారు.
బకాసురులు బకాయిలు పెట్టారు..
తమ ప్రభుత్వ హయాంలో కష్టమైనా నెల మొదటి తారీఖున జీతాలు ఇవ్వాల్సిందేనని అధికారులను ఆదేశించానని సభావేదికగా సీఎం స్పష్టం చేశారు. బడి పిల్లల కూరగాయలు, బట్టలకు కూడా చెల్లించకుండా బకాయిలు పెట్టారని బీఆర్ఎస్పై మండిపడ్డారు. సర్పంచ్లకు రూ.వందల కోట్లు బకాయిలు పెట్టారని.. సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధర్నాలు చేశారని విమర్శించారు. బకాసురులు బకాయిలు పెడితే.. అప్పులు కట్టే పని మాత్రం తనకు పడిందని అన్నారు.
ఫామ్హౌస్లో ఉండట్లేదు..
ఇనుప కంచెలు వేసుకుని తాను లోపల లేనని సీఎం వ్యాఖ్యానించారు. ఎప్పుడు ప్రజల్లోనే ఉంటున్నామని.. తప్పించుకుని తిరగడం లేదన్నారు. తాను ఫామ్హౌస్లో ఉండటం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 25.35 లక్షల మంది రైతులకు ఇరవై వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామన్నారు. తమ ప్రభుత్వం రైతు భరోసా కింద ప్రభుత్వం రాగానే రూ.7 వేల కోట్లను రైతులకు చెల్లించిందని తెలిపారు. రైతు భరోసాను రూ.12 వేలకు పెంచి ఇప్పటి వరకు రూ.27 వేల కోట్లు రైతు ఖాతాల్లో వేశామని స్పష్టం చేశారు.

