కలం, కరీంనగర్ బ్యూరో : తనకు వివాహం జరగలేదని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు పోక్సో కేసు (POCSO Case) నమోదు చేశారు. కరీంనగర్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం… పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగ్దుంపూర్ కు చెందిన మైనర్ బాలిక కాలేజీకి వెళ్తున్న క్రమంలో మానకొండూరు మండలం జగ్గయ్యపల్లికి చెందిన ఆటో డ్రైవర్ గనుకుంట్ల మురళీ కృష్ణతో పరిచయం ఏర్పడింది.
నిందితుడు పలుమార్లు జగ్గయ్యపల్లిలోని అతని ఇంటికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు. అయితే మురళీ కృష్ణకు అప్పటికే వివాహం అయిన విషయం తెలిసి బాధితురాలి అతన్ని కలవడం మానేసింది. అతను పలు మార్లు ఫోన్ చేసినప్పుడు బాధితురాలు మాట్లాడినప్పటికీ అతన్ని కలిసేందుకు నిరాకరించింది. దీంతో జూన్ 29వ తేది సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో టీసీ కోసం మల్యాల వెల్లేందుకు ముగ్దుంపూర్ స్టేజీ వద్ద బస్సు కోసం బాధితురాలు ఎదురుచూస్తోంది.
ఇంతలో అక్కడకు బైక్ పై వచ్చిన మురళీ కృష్ణ బాలికను బలవంతంగా బైక్ పై ఎక్కించుకుని పెద్దపల్లి జిల్లా నీరుకుళ్ల గ్రామంలోని సమ్మక్క సారలక్క ఆలయం వద్దకు తీసుకెళ్లాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడు.. అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెపై విక్షణారహితంగా దాడిచేసి.. శారీరకంగా కలవకపోతే చంపుతానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితునిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి మీడియాకు తెలిపారు.

