Mobile Popup Ad
Mobile Popup Ad

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత!

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో ఈగల్ ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన మెరుపు దాడిలో భారీగా గంజాయి పట్టుబడింది. బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ వెస్ట్ గేట్ సమీపంలో పోలీసులు చేపట్టిన ముమ్మర వాహన తనిఖీల్లో లారీలో తరలిస్తున్న దాదాపు 525 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ. 2.62 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

​ఒడిశా అడవుల నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్‌కు ఈ గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు పోలీసుల కళ్లు గప్పేందుకు లారీలో ప్రత్యేకంగా ఒక రహస్య భాగాన్ని ఏర్పాటు చేసి అందులో గంజాయిని దాచారు. అయితే, చాకచక్యంగా వ్యవహరించిన ఈగల్ ఫోర్స్, పోలీసు సిబ్బంది లారీని క్షుణ్ణంగా సోదా చేసి ఈ భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు.

​ఈ సంయుక్త ఆపరేషన్‌లో గంజాయి తరలిస్తున్న ముగ్గురు అంతరాష్ట్ర స్మగ్లర్లను పోలీసులు ఘటనా స్థలంలోనే అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 525 కిలోల ఎండు గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన లారీ, దానికి ఎస్కార్ట్‌గా వస్తున్న ఒక పల్సర్ బైక్, 5 మొబైల్ ఫోన్లు, రూ. 10,570 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉండి, ప్రస్తుతం పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గంజాయి సరఫరా వెనుక ఉన్న ప్రధాన ముఠా నెట్‌వర్క్‌ను ఛేదించే దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>