కలం, మెదక్ బ్యూరో : మెదక్ (Medak) జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో తూప్రాన్ మండలం దాతర్పల్లి టీఎస్డబ్ల్యూఆర్ఎస్ పాఠశాల, కళాశాల హాస్టల్లో విద్యార్థినుల కోసం బాలికల భద్రతపై అవగాహన (Girl Safety Awareness) కార్యక్రమం నిర్వహించారు. మహిళల భద్రత, బాలికల రక్షణ, సైబర్ నేరాల నివారణ, మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ దుష్పరిణామాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈవ్టీజింగ్, స్టాకింగ్, సోషల్ మీడియా వేధింపులు వంటి ఘటనలను సహించకుండా వెంటనే షీ టీమ్, మహిళా హెల్ప్ డెస్క్ లేదా అత్యవసర సేవ ERSS-112ను సంప్రదించాలని సూచించారు.
టీ-సేఫ్ (T-Safe) యాప్ వినియోగం, షీ టీమ్ సేవలు, మహిళా హెల్ప్ డెస్క్ ద్వారా అందుతున్న రక్షణ చర్యల గురించి వివరించారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పాస్వర్డ్లు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ నేరస్థులు యువతను వివిధ మార్గాల్లో వలలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఎలాంటి బెదిరింపులు, వేధింపులు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో (Girl Safety Awareness) తూప్రాన్ ఎసై గంగా రాజు, షీ టీమ్ సిబ్బంది, పాఠశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Read Also: గుడ్ న్యూస్.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ
Follow Us On: Instagram

