కలం, వెబ్ డెస్క్ : రైతుబంధు కాదు.. రాబంధు బకాయిలు పెడితే తాము వచ్చాక చెల్లిస్తున్నామని.. పరోక్షంగా కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన రైతు భరోసా (Rythu Bharosa) సదస్సులో సీఎం 44.28 లక్షల మంది రైతులకు రూ.2,482 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెండున్నర ఏళ్లలో రైతుల సంక్షేమం కోసం రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేశామని, రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు రూ.27 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ప్రస్తుతం తొమ్మిది రోజుల వ్యవధిలో మరో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం.. మహిళల ప్రభుత్వం.. నిరుద్యోగుల ప్రభుత్వం.. రైతుల ప్రభుత్వం.. అందరి ప్రభుత్వం. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు.
‘అబద్ధాలు చెప్పం.. చెప్పిన మాట తప్పం.. మాట ఇస్తే వెనక్కి తగ్గం. ప్రజల ఆశీర్వాదంతో మరింత బాధ్యతగా పనిచేస్తాం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.7 వేల కోట్ల రైతు భరోసా నిధులను కూడా తమ ప్రభుత్వమే రైతులకు అందించిందని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2 కోట్ల 88 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామని తెలిపారు.
గత ప్రభుత్వం నెలకు సుమారు రూ.2,500 కోట్లు రైతులపై ఖర్చు చేస్తే, తమ ప్రభుత్వం నెలకు దాదాపు రూ.6 వేల కోట్లు రైతు సంక్షేమానికి వెచ్చిస్తోందని వెల్లడించారు.రైతులు సంప్రదాయ పంటలతో పాటు నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలు, అధిక లాభాలు ఇచ్చే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల సాగు చేస్తే రైతుల ఆదాయం మరింత పెరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నతాధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: బీఆర్ఎస్ బరితెగించి మాట్లాడుతోంది: భట్టి
Follow Us On: Sharechat

