కలం, వెబ్ డెస్క్: సంగారెడ్డి వేదికగా మాజీ సీఎం కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సవాల్ విసిరారు. రాష్ట్ర రైతులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో, తమ హయాంలో ఏం చేశామో.. ‘అసెంబ్లీ రా మాట్లాడదాం’ అంటూ ఛాలెంజ్ చేశారు. సంగారెడ్డి గడ్డా నుంచి సవాల్ విసురుతున్నట్లు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర వ్యాప్త నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. దేశంలో 3 కోట్ల 48 లక్షల మందికి సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చే బియాన్ని పశువులకు దాణాగా వేసేవారని విమర్శించారు.
రైతుల కష్టాలను తీర్చేందుకు ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని అన్నారు. అప్పులు లేని రైతులు తెలంగాణలో ఉన్నారని కేంద్రమే నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఈ విషయం బీజేపీ నేతలకు తెలియదా? అని సీఎం ప్రశ్నించారు. రైతులు పండించిన పంట కొని రూ.90వేల కోట్లు వారి ఖాతాల్లో వేశామని స్పష్టం చేశారు. ఉచిత కరెంట్ కోసం ఏడాదికి రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆనాడు వ్యవసాయం దండగ అంటే.. ఇనాడు పండుగ చేసి చూపిస్తున్నామని వ్యాఖ్యానించారు.

