కలం, వెబ్ డెస్క్: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) దంపతులపై మార్ఫింగ్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. మంత్రి శ్రీధర్ బాబు, ఆయన సతీమణి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్ దంపతులను లక్ష్యంగా చేసుకుని కొందరు సోషల్ మీడియాలో ఏఐ మార్ఫింగ్ వీడియోలు క్రియేట్ చేశారు. మరీ ముఖ్యంగా, ఫేస్బుక్లో అసభ్యకర రీతిలో కంటెంట్ రూపొందించి పోస్టులు పెడుతున్నారు. ఈ మేరకు శ్రీధర్ బాబు న్యాయవాది శశిభూషణ్ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాళేశ్వరం ఆలయంలో అవినీతి పేరిట..
మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియోజకవర్గం పరిధిలోని కాళేశ్వరం దేవాలయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ‘బీఆర్ఎస్ పార్టీ మంథని’ పేరిట ఉన్న ఫేస్ బుక్ అకౌంట్లో పోస్టులు పెట్టారు. శ్రీధర్ బాబు సతీమణి ప్రస్తుతం దేవాదాయ శాఖ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. దీంతో, ఆమెను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఫేక్ పోస్టులు పెట్టారని లాయర్ ఫిర్యాదు చేశారు.

