కలం, వెబ్ డెస్క్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ దేశంలో మరో కీలక దశకు చేరుకుంది. భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మూడో విడత నేటి నుంచి మరో ఐదు కీలక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికారికంగా ప్రారంభంకానుంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు కర్నాటక, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ ఓటర్ల జాబితా సవరణ, తనిఖీ ప్రక్రియ నేటి నుంచి ముమ్మరంగా సాగనుంది. నకిలీ ఓట్లను తొలగించడం, అర్హులైన కొత్త ఓటర్లను చేర్చడం, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్ల వివరాలను ఒకే చోటికి చేర్చడం వంటి పనులను ఈ ప్రక్రియ ద్వారా పూర్తి చేయనున్నారు.
ఈ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ జూలై 29 వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ కాలంలో బూత్ స్థాయి అధికారులు (BLO) ప్రతి ఇంటికీ స్వయంగా వెళ్లి ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఓటర్ల నుంచి వివరాలు సేకరించిన అనంతరం, ఆగస్టు 5వ తేదీన ఓటర్ల ప్రాథమిక ముసాయిదా జాబితాను (డ్రాఫ్ట్ రోల్) విడుదల చేస్తారు. ఈ ముసాయిదాపై అభ్యంతరాలు, సవరణలకు అవకాశం కల్పించిన తర్వాత, అన్ని దరఖాస్తులను పరిశీలించి చివరగా అక్టోబర్ 10న తుది ఓటర్ల జాబితాను (ఫైనల్ ఎలక్టోరల్ రోల్) అధికారికంగా ప్రకటించనున్నారు. ఓటర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని అధికారులు సూచించారు.

