కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట (Aswaraopeta) మండలంలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను, రైతులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల నుంచి తెలంగాణ వైపు ప్రవేశించిన ఈ పులి.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయ పరిసరాలు, గోగులపూడి అటవీ ప్రాంతంతో పాటు కావడిగుండ్ల గ్రామ శివార్లలో సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు.
ఆంధ్రప్రదేశ్లోని పాపికొండల అభయారణ్యం, ఏలూరు జిల్లా సరిహద్దుల మీదుగా ప్రయాణించిన ఈ పెద్దపులి.. కావడిగుండ్ల పరిసర ప్రాంతాల్లో మేత మేస్తున్న పశువులపై దాడికి ప్రయత్నించింది. అయితే పశువుల కాపరులు, స్థానికులు వెంటనే అప్రమత్తం కావడంతో పులి అక్కడ నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. ఈ ఘటనతో గిరిజన గ్రామాల ప్రజలు, అటవీ నడక సాగించే కూలీలు బయటకు రావడానికే భయపడుతున్నారు.
విషయం తెలుసుకున్న అటవీశాఖ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి, పులి సంచరించిన ప్రాంతాల్లో పాదముద్రలను సేకరించాయి. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. పరిసర గ్రామాల ప్రజలు, రైతులు ఒంటరిగా అడవి ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పులి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని అటవీశాఖ అధికారులు కోరారు.

